శ్రీ సత్య సాయి జిల్లా, APTODAY: ధర్మవరం పట్టణ ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేస్తూ కొత్తపేటలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ (BSNL) కార్యాలయంలో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన ఆధార్ కేంద్రాన్ని బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ (DE) నెనావత్, సబ్ డివిజనల్ ఇంజనీర్ (SDE) ఉదయ్ కుమార్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్థానిక ప్రజలు ఆధార్ సేవల కోసం దూరప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో నూతన ఆధార్ కార్డుల నమోదు, ఆధార్ కార్డులో చిరునామా మార్పు/సవరణ, ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం, బయోమెట్రిక్ అప్డేట్, వేలిముద్రలు, ఐరిస్, ఫోటో గుర్తింపు వంటి సేవలు ఉంటాయన్నారు. ఆధార్ కేంద్రం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు ప్రజలకు సేవలను అందిస్తుందన్నారు. కావున ధర్మవరం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఆధార్ కార్డులలో ఎలాంటి సవరణలు లేదా కొత్త నమోదులు ఉన్నా, దానికి సంబంధించిన ఒరిజినల్ గుర్తింపు మరియు చిరునామా పత్రాలతో నేరుగా కొత్తపేటలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి విచ్చేసి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.