ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం అద్వితీయమైనదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.భారత దేశ రెండవ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహోన్నత తత్వవేత్త, మహా మనిషి భారత దేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అటువంటి మహనీయుడు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఒక ఏడాది పాటు పని చేయడం మన గోదావరి తీర ప్రాంత వాసులందరికీ గర్వకారణమన్నారు.ఆయన తన జీవితకాలమంతా విజ్ఞాన వ్యాప్తికి కృషి చేశారని, వందకు పైగా పురస్కారాలు పొందారని కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ బాటలో నేటి ఉపాధ్యాయులు పయనించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు మాత్రమే తన శిష్యులందరూ ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. మరే వృత్తిలోనూ ఇది సాధ్యం కాదన్నారు. తన విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసే గొప్పతనం ఉపాధ్యాయులకు ఉంటుందన్నారు. తన గురువైన సుందరం మాస్టారు ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలంటే తెలియని వయసులోనే తనను నీవు ఎమ్మెల్యే అవ్వాలి అంటూ సుందరం మాస్టారు దీవించారని, ఆయన దీవెనలతో కొత్తపేట ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే కావడం జరిగిందన్నారు. గురువు ఆశీర్వాదం ఎంత గొప్పదో ఈ సంఘటన ద్వారా తెలుస్తుందన్నారు. తనకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులందరూ తనకు ఆరాధ్యులని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను చూసి పిల్లలు ఏ విధంగా నడవడిక నేర్చుకుంటారో, అదేవిధంగా గురువులను చూసి నడవడికను రూపొందించుకుంటారని, కనుక ఉపాధ్యాయులు ఎంత ఆదర్శంగా ఉంటే విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా ముందుకు వెళతారని తెలిపారు.