నల్లమాడ, సెప్టెంబర్ 5 (APTODAY) : నల్లమాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న జయశంకర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషికి ఈ పురస్కారం దక్కింది.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు బోధనలో వినూత్న విధానాలను అనుసరిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు జయశంకర్ కృషి చేస్తున్నారని సహచర ఉపాధ్యాయులు తెలిపారు. పాఠ్యాంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, తోటి ఉపాధ్యాయులకు కూడా బోధనా పద్ధతులు, విషయ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ వారి వృత్తిపరమైన అభివృద్ధికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న జయశంకర్కు రాష్ట్రస్థాయి పురస్కారం లభించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.