బ్లూ మూన్ స్కూల్లో ఘనంగా విద్యార్థి నాయకుల ఎన్నిక
బ్యాలెట్ పద్ధతిలో విద్యార్థుల ఓటింగ్.. ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన
కదిరి, సెప్టెంబర్ 10 (AP Today): కదిరి పట్టణంలోని గంగమ్మ మోరి ఎదురుగా ఉన్న బ్లూ మూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థి నాయకుల ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ ఎన్నికలను నిర్వహించారు.
పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, కల్చరల్ హెడ్, స్పోర్ట్స్ కెప్టెన్, హౌస్ కెప్టెన్ తదితర పదవులకు విద్యార్థులు పోటీ చేశారు. అనంతరం బ్యాలెట్ పద్ధతిలో విద్యార్థులతో ఓటింగ్ నిర్వహించి, అత్యధిక ఓట్లు సాధించిన విద్యార్థులను ఆయా పదవులకు ఎన్నుకున్నారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు
ఈ సందర్భంగా బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత ఎం. శివశంకర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ ఎన్నికలను నిర్వహించినట్లు తెలిపారు.
విద్యార్థులు ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా ఓటు విలువ, ప్రజాస్వామ్య పద్ధతులు, నాయకత్వ బాధ్యతలపై అవగాహన పెరుగుతుందని అన్నారు.
విద్యాసంస్థల డైరెక్టర్ మౌనిక మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
నూతనంగా ఎన్నికైన విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సురేందర్ రెడ్డి సూచించారు. విద్యార్థులందరినీ కలుపుకొని పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నూతన నాయకులకు సూచించారు.
అనంతరం వివిధ విభాగాలకు నూతనంగా ఎన్నికైన విద్యార్థులను పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సి. మాధవరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు జి. రామాంజుల రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.