భారత్-రష్యా మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం నిరంతరం బలపడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత చొరవతో పాటు.. ఇరు దేశాల నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
బిష్కెక్ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-రష్యా సంబంధాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య సంబంధాల పురోగతిపై పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యా మధ్య కేవలం వాణిజ్య సంబంధాలే కాకుండా.. దృఢమైన వ్యక్తిగత స్నేహబంధం కూడా ఉందని తెలిపారు.
గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఎస్సీఓ కీలక వేదికగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. సదస్సుకు ముందుగా మోదీతో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు.
ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావించిన అంశాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు.
ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం ఆశాజనకంగా ఉందని పుతిన్ తెలిపారు. గతేడాది స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ.. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత్-రష్యా వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు.
విద్యా రంగంలోనూ ఇరు దేశాల సహకారం అద్భుతంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో రష్యాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మంది భారతీయ విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం రష్యా సిద్ధమవుతోందని పుతిన్ తెలిపారు.
అంతేకాదు.. 2027 నాటికి భారత్-రష్యా దౌత్య సంబంధాలు 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న విషయాన్ని కూడా పుతిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మొత్తంగా మోదీ-పుతిన్ భేటీతో భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక, వాణిజ్య, విద్యా రంగాల్లో సహకారంపై మరోసారి స్పష్టమైన సందేశం వెలువడింది.