టాలీవుడ్ విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్ వేదికగా చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన రాజకీయ, సామాజిక అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసే రాహుల్ రామకృష్ణ.. తాజాగా “చితి చివరిదాకా... కేసీఆర్!” అంటూ చేసిన పోస్ట్ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ పోస్ట్ను ఏ సందర్భాన్ని పురస్కరించుకుని చేశారనే విషయంపై రాహుల్ రామకృష్ణ నుంచి స్పష్టత రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మద్దతుదారులు, కేసీఆర్ అభిమానులు ఈ పోస్టును పెద్ద ఎత్తున షేర్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు రాహుల్ రామకృష్ణ రాజకీయ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ రామకృష్ణ రాజకీయ అంశాలపై స్పందించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు, అభిమానుల నుంచి తీవ్ర ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. అలాగే తెలంగాణ రాజకీయాలపై గతంలో కేసీఆర్, కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ చేసిన పలు ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో తన ప్రత్యేకమైన కామెడీ, విభిన్నమైన సంభాషణలతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ రామకృష్ణ.. నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు పొందారు.
తాజాగా చేసిన “చితి చివరిదాకా... కేసీఆర్!” ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ పోస్టుపై రాహుల్ రామకృష్ణ మరింత వివరణ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.